పులికి క‌రోనా పాజిటివ్.. జంతువుల్లో తొలిసారి, కొత్త టెన్షన్

రోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పటివరకూ మ‌నుషుల్లో ఒకరి నుంచి మరొకరి సోకిన ఈ ప్రాణాంతక వైరస్.. తాజాగా జంతువులకు వ్యాపించింది. తొలిసారిగా ఓ పులికి కరోనా వైరస్ సోకింది. క‌రోనా కరాళనృత్యం చేస్తున్న అమెరికాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూలో మలయన్ జాతికి చెందిన నాలుగేళ్ల నదియా అనే ఆడ పులికి కరోనా వైరస్ సోకింది. వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.


నదియా కొద్ది రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతోంది. అనుమానంతో పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే.. నదియాతో పాటు మరో మూడు పులులు, మూడు ఆఫ్రికన్ సింహాలకు కూడా ఇలాంటి లక్షణాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ సోకిన పులులు, సింహాలు ఆహారం తీసుకోవడం బాగా తగ్గించాయని జూ సిబ్బంది తెలిపారు. ఇప్పటికైతే బాగానే తిరుగుతున్నాయని చెప్పారు.జూలో జంతువులకు కరోనా ఎలా సోకిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వాటి ఆలనాపాలనా చూసే జూ ఉద్యోగి ద్వారానే ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్లు జూ అధికారులు అనుమానిస్తున్నారు. వైరస్ బారిన పడిన పులులను జూలోని టైగర్ మౌంటైన్ ఎగ్జిబిట్‌లో ఉంచినట్లు వెల్లడించారు. ఇప్పటిదాకా మనుషుల ద్వారా వ్యాపిస్తున్న కరోనా వైరస్.. ఇక జంతువుల ద్వారా కూడా విస్తరిస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.